‘సరిగ్గా రెండేళ్ల క్రితం 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక చారిత్రక తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు కేవలం ఒక గెలుపు కాదు... అహంకారంపై సామాన్యుడు సంధించిన ఒక బలమైన సందేశం. ఒక తిరుగులేని హెచ్చరిక. భయాన్ని, అహంకారాన్ని, అధికారమే అంతా అనే అనాగరిక రాజకీయ సంస్కృతిని ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల కంటే ఎవరూ ఎక్కువ కాదని నిరూపించారు. ఆ నాడు ఓటర్లు ఇచ్చిన తీర్పు ఆంధ్రప్రదేశ్ సమాజానికి కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడమే కాకుండా, రాబోయే తరాల భవిష్యత్తుకు గట్టి నమ్మకాన్ని కల్పించింది. ప్రజలు మనకిచ్చింది కేవలం అధికారం కాదు, రాష్ట్రాన్ని కాపాడి ప్రగతిపథంలో నడిపించే ఒక గొప్ప బాధ్యత’ అని జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. ఈ చారిత్రక విజయానికి కారణమైన ప్రతి ఓటరుకీ, రైతుకు, నాయకుడికి, కార్యకర్తకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం కూటమిలోని ఏ ఒక్క పార్టీదో కాదు, ఇది ప్రజా విజయమని అన్నారు. రెండేళ్ల క్రితం ప్రజలు ఇచ్చింది అధికారం కాదు బాధ్యత అని తెలిపారు. దేశానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి దూరదృష్టి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి అనుభవం.. ప్రజల ఆకాంక్షలను ప్రతిబించించే జనసేన పార్టీ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి బలమైన పునాది పడినట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం 21 సీట్లకు పరిమితమై జనసేన చేసిన త్యాగానికి ప్రజలు 100 శాతం స్ట్రయిక్ రేట్ తో సమాధానమిచ్చారని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతి వేదికగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరిట నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కలసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సభను ఉద్దేశించి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తూ “ప్రధాన మంత్రిగా సుదీర్ఘకాలం బాధ్యతలు నిర్వర్తించి శ్రీ నెహ్రూ గారి రికార్డును అధిగమించిన గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి కూటమి ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. రెండేళ్ల క్రితం జనసేన 21 సీట్లకు సరిపెట్టుకున్న సందర్భంలో చాలా మంది విమర్శలు చేశారు. మేము రాజీపడలేదు.. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం 21 సీట్లకు పరిమితమయ్యాం. ఆ త్యాగం ఫలితంగా ఈ రోజన రెండేళ్ల క్రితం మేమిచ్చిన హామీలు ఒక్కొక్కటిగా ఆచరణలో కనబడుతున్నాయి. పెరిగిన వృద్ధాప్య పింఛన్లు, మహిళలకి ఆర్థిక భరోసా, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకి అండగా అన్నదాత సుఖీభవ, అన్నా క్యాంటీన్లు, విద్యకి ఇస్తున్న ప్రాధాన్యత, యువతకి ఉపాధి అవకాశాలు ఇలా ప్రతి అంశంలో మేము ఇచ్చిన మాట తూచా తప్పకుండా ఆచరణలోపెడుతున్నాం.
• ప్రజల జీవితాలకు దగ్గరగా ఉండేది గ్రామ పరిపాలనా వ్యవస్థే
మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం, పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన అంత్యోదయ సిద్ధాంతం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా స్థానిక స్వపరిపాలనకు వేసిన బలమైన ప్రజాస్వామ్య పునాదుల తాలూకు ఆలోచనల సమాహారమే నేటి ప్రధాని శ్రీ మోదీ గారి పాలనా తత్వం. “సబ్ కా సాత్.. సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్”. గ్రామాన్ని భారత దేశానికి కేంద్ర బిందువుగా చూడాలన్న ఆకాంక్షతో, అత్యంత నిబద్దతతో కృషి చేస్తున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మాట్లాడుతున్నా. పిల్లవాడి భవిష్యత్తు పాఠశాలలో నిర్ణయించబడినట్టే.. దేశ భవిష్యత్తు గ్రామాల్లో నిర్ణయించబడుతుంది. ఒక రైతు ఆశ, ఒక మహిళ ఆత్మవిశ్వాసం, ఒక యువకుడి ఉపాధి, కుటుంబం ఆరోగ్యం ఇవన్నీ గ్రామ పంచాయతీల ద్వారానే ప్రభావితం అవుతాయి. ప్రజల జీవితాలకు దగ్గరగా ఉండేది గ్రామ పరిపాలనా వ్యవస్థే.. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిపాలనలో సబ్సిడారిటీ అనేది ఒక వ్యవస్థాపక సిద్ధాంతం. ఏ పనిని ప్రజలకు దగ్గరగా, సమర్థంగా చేయగలమో ఆ పనిని అక్కడే చేయాలి. గ్రామ స్థాయిలో అవ్వాల్సిన పని మండల స్థాయికి వెళ్లకూడదు. మన దగ్గర ప్రతి పని ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది.
• అధికారాన్ని కేంద్రీకరించడం ప్రజాస్వామ్యం కాదు
అధికారాన్ని కేంద్రీకరించడం ప్రజాస్వామ్యం కాదు. అధికారాన్ని ప్రజల దగ్గరకు తీసుకువెళ్లడమే నిజమైన ప్రజాస్వామ్యం. ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో 600 మంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఉంటారు. ప్రజాస్వామ్యానికి వారే వేళ్లు. ఆ రూట్స్ ని బలహీనపరిస్తే చెట్టుని బలపర్చలేం. స్థానిక సంస్థల్ని బలహీనపర్చి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయలేం. ఇది ప్రజాస్వామ్య సూత్రం. నాయకత్వం గ్రామ స్థాయి నుంచి రావాలి. రెండేళ్లలో మేము గ్రామాల్లో నిర్మించడానికి ప్రయత్నించింది కేవలం కేవలం రోడ్లు, కాలువలు, భవనాలు కాదు. వ్యవస్థల మీద నమ్మకం. ఒక వ్యవస్థ బలహీన పడినప్పుడు మొదట కోల్పోయేది డబ్బు కాదు. నమ్మకం. వ్యవస్థ న్యాయం చేయకపోతే కులం ముందుకు వస్తుంది.