ధరిత్రి రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
•‘ఏక్ పేడ్ మా కే నామ్’ థీమ్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరిట మొక్క నాటాలి
•మనం నాటే ప్రతి మొక్క మహావృక్షం కావాలి
•ప్రతి చెట్టు వాతావరణ మార్పులపై రక్షణ కవచంగా నిలవాలి
•రాష్ట్రాన్ని పచ్చగా మార్చి... వాతావరణ మార్పుల నుంచి కాపాడుకుందాం
•ఎన్టీఆర్ జిల్లా మూలపాడు బటర్ ఫ్లై పార్క్ లో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
• తన తల్లి శ్రీమతి అంజనా దేవి గారి పేరిట తెల్లపొణికి మొక్క నాటిన శ్రీ
@PawanKalyan గారు
•2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమానికి శ్రీకారం
• వర్షా కాలంలో రాష్ట్రమంతా చల్లడానికి మాస్టర్ ప్లాన్
‘భూమిని, పచ్చదనాన్ని కాపాడుకోవడం మన అందరి కనీస బాధ్యత. రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించాలంటే ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కనైనా నాటి, దానిని సంరక్షించాలి. మనం విసిరే ప్రతి విత్తన బంతి ఒక మహావృక్షం కావాలి. ప్రతి చెట్టు వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ఒక రక్షణ కవచంలా మారాలి. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ఒక భాగస్వామి కావాలి. మనమందరం కలిసికట్టుగా శ్రమించి పచ్చని, ఆరోగ్యకరమైన, వాతావరణ మార్పులను తట్టుకోగల ఆంధ్రప్రదేశ్ను నిర్మిద్దామ’ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం ఎన్టీఆర్ జిల్లా, కొండపల్లి సమీపంలోని మూలపాడు బటర్ ఫ్లై పార్క్ లో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్వయం సహాయక బృందాలు, విద్యార్థులు, మూలపాడు గ్రామస్తులతో కలసి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సీడ్ బాల్స్ తయారు చేశారు. సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజాప్రతినిధులు, పొదుపు సంఘాల మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది, పాఠశాల, కళాశాల విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ వలంటీర్లతోపాటు రాష్ట్ర ప్రజలు ఇందులో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “పర్యావరణాన్ని కాపాడుకునే హరిత సంకల్పానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున రెండు సరికొత్త, అద్భుతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
తల్లి జీవం పోస్తే.. చెట్టు ఆ జీవాన్ని కాపాడుతుంది
మొదటి కార్యక్రమంగా గౌరవ ప్రధాన మంత్రి శ్రీ
@narendramodi గారి “ఏక్ పేడ్ మా కే నామ్” థీమ్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తమ మాతృమూర్తి పేరిట ఒక మొక్క నాటాలి. మా తల్లి గారైన శ్రీమతి అంజనా దేవి గారి పేరిట మూలపాడు బటర్ ఫ్లై పార్క్ లో తెల్ల పొణికి మొక్కని నాటడం జరిగింది. తల్లి జీవం పోస్తే.. అదే జీవాన్ని చెట్టు కాపాడుతుందనే సందేశం ఇచ్చే ఈ కార్యక్రమం ద్వారా కొండపల్లి బొమ్మల కళాకారుల జీవనోపాధికి ఉపయోగపడే 1,000 తెల్లపొణికి చెట్లను ఒకే చోట నాటడం ఆనందం కలిగించింది. రెండవ కార్యక్రమంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న మరో అద్భుత సంకల్పం పెద్ద ఎత్తున సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం. ఈ పర్యావరణ దినోత్సవాన, పర్యావరణ పరిరక్షణ కోసం 2.5 కోట్ల సీడ్ బాల్స్ ను తయారీకి శ్రీకారం చుట్టాం. ఈ రోజు నుంచి జూన్ 15 వరకు పది రోజులపాటు అన్ని జిల్లాల్లో సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియను ప్రజల సహకారంతో ప్రజా ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్తాం. ఎర్ర బంకమట్టికి, కంపోస్ట్ జోడించి పూర్తి ఆర్గానిక్ పద్దతిలో తయారు చేసే ఈ సీడ్ బాల్స్ ని వర్షాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా చల్లించేందుకు ఏర్పాట్లు చేశాం.
* ఎల్ పర్యావరణ పరిరక్షణతో సమతుల్య జీవ వైవిధ్యం
సీడ్ బాల్స్ తయారు చేయడం, చల్లించడం పర్యావరణ పరిరక్షించడంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి సీడ్ బాల్ ఒక చెట్టుని సృష్టించే శక్తి కలిగి ఉంటుంది. ప్రతి చెట్టు వాతావరణ మార్పుల ప్రభావం నుంచి భూమిని రక్షిస్తుంది. గాలి నాణ్యత పెంచి కాలుష్యాన్ని తగ్గిస్తాయి. భూగర్భ జలాలు పెరగడానికి, నీటిని నిల్వ చేయడానికి ఇవి దోహదపడతాయి. పక్షులు, జంతువులకు ఆశ్రయం కల్పిస్తూ సమతుల్య జీవవైవిధ్యాన్ని పెంపొందిస్తాయి. ఈ సీడ్ బాల్స్ ని అడవులు, కొండ ప్రాంతాల్లో మొక్కలు తక్కువగా ఉన్న ప్రదేశాలు, నదీ తీరాలు, చెరువు గట్లు, ఖాళీ ప్రదేశాల్లో వెదజల్లే ఏర్పాటు చేస్తున్నాం. కొండలు, మనుషులు వెళ్లలేని ప్రాంతాల్లో సీడ్ బాల్స్ చల్లేందుకు అధునాతన డ్రోన్స్ సాయం తీసుకుంటున్నాం. రాష్ట్రాన్ని హరిత వనంగా మార్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఈ అద్భుత కార్యక్రమంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా పాల్గొని విజయవంతం చేయాలి. (1/2)