25 ఏళ్ళు.. 23 కేసులు..
నేరస్థులకు అండగా ఉంటామన్న వైసీపీ..
రేప్ లు మర్డర్ల నుంచి గొడ్డలి ఫొటో వరకూ…
బతికి ఉన్నాడా బలయ్యాడా అంటూ ఒక యువకుడి అదృశ్యం కేసుపై కులం యాంగిల్ లో సంచలన కథనాలు ప్రచురిస్తున్న ఒక వర్గం మీడియా అసలు నిజాలను దాచిపెడుతున్నది. అదృశ్యం అయిన 'పిల్లా సాయి' అనే ఆ యువకుడి వాస్తవ విషయాలను చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. 'పిల్లా సాయి' ఒక అంతర్రాష్ట్ర రౌడీషీటర్ గా పోలీసు రికార్డులలో నమోదై ఉన్నాడు. విజయవాడ నుంచి తెలంగాణ వరకు అతనిపై కేసుల పరంపర కొనసాగుతూనే ఉన్నది.
విజయవాడ నగరంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలను వణికించిన ఒక ప్రమాదకరమైన నేరగాడి చరిత్ర ఇది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ కాలనీకి చెందిన గద్దె సాయి కృష్ణ అలియాస్ పిల్లా సాయి (25 ఏళ్ళు) నేర చరిత్ర చూస్తే అందరికి వణుకు పుడుతుంది.
కేవలం 25 ఏళ్ల వయస్సులోనే హత్య, అత్యాచారం, POCSO, కిడ్నాప్, దోపిడీలు, మరియు గంజాయి స్మగ్లింగ్ వంటి 23 తీవ్రమైన క్రిమినల్ కేసులలో పిల్లా సాయి నిందితుడిగా ఉన్నాడు. ప్రజా శాంతికి, శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగిస్తున్న ఇతనిపై ఇప్పటికే 2017 జనవరి 15న రౌడీషీట్ ని
C.No.122/HS/ACP-SD/2017) విజయవాడ పోలీసులు ఓపెన్ చేశారు.
విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ లను పోషిస్తూ భయానక నేరాలకు పాల్పడుతూ, నగర ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వ్యక్తిగా పిల్లా సాయి గుర్తింపు పొందాడు. గద్దె సాయి కృష్ణ విజయవాడ నగరానికే పరిమితం కాకుండా గుంటూరు జిల్లా, రాజమండ్రి మరియు తెలంగాణలోని హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో కూడా నేరాలకు పాల్పడుతున్న ఒక 'అంతర్రాష్ట్ర నేరగాడు' (Interstate Offender)గా పోలీసు రికార్డులలో ఉంది.
అతనిపై మొత్తం 23 అతి తీవ్రమైన కేసులు ఉన్నాయి. అందులో ఒకటి హత్య (Murder) కేసు కాగా 3 గంజాయి / మాదకద్రవ్యాలు (NDPS) స్మగ్లింగ్ కేసులు ఉన్నాయి. అదే విధంగా 4 దోపిడీలు (Robbery) కేసులు, 5 దాడి / గాయపరచడం (Hurt/Assault) కేసులు, ఒకటి చిన్న పిల్లపై అత్యాచారం / పోక్సో (Rape/POCSO) కేసు, 3 ఆస్తి నష్టం / దొంగతనాల కేసులు అతనిపై ఉన్నాయి. బెదిరించి వసూళ్లు (Extortion) చేసిన కేసు ఒకటి, గ్యాంబ్లింగ్ (Gaming Act) కింద 1 కేసు, సెక్యూరిటీ ప్రొసీడింగ్స్ కింద 3 కేసులు ఉన్నాయి.
మహిళలు కనిపిస్తే వేధింపులే :
గంజాయి మత్తులో మునిగి తేలే పిల్లా సాయి ప్రవర్తనతో, సామాన్య మహిళలు, యువతులు బయటకి రావాలంటనే వణికిపోయే పరిస్థితి నెలకొంది. అటు పోక్సో కేసులు, ఇటు అత్యాచార యత్నాల చరిత్ర ఉన్న ఇలాంటి రౌడీషీటర్ వల్ల ఆడబిడ్డలు రోడ్డు మీదకు రావాలంటే వణికిపోయే పరిస్థితి. రోడ్లపై ఒంటరిగా కనిపించే మహిళలను లక్ష్యంగా చేసుకుని అరాచకాలకు తెగబడటం ఇతని క్రిమినల్ ప్రొఫైల్ స్పష్టం చేస్తోంది.
మాదకద్రవ్యాల కేసులపై ప్రత్యేక దృష్టి :
ఇటీవలి కాలంలో నమోదైన కేసుల్లో గంజాయి అక్రమ రవాణా, స్వాధీనం మరియు సంబంధిత నేరాలకు సంబంధించిన ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. హైదరాబాద్లో నమోదు చేసిన కేసుతో పాటు విజయవాడ పరిసర ప్రాంతాల్లోనూ మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయని పోలీసులు చెబుతున్నారు. నిందితుడు పిల్లా సాయి Anti-social elementsతో చేతులు కలిపినట్లు నిఘా వర్గాల సమాచారం. ఇతనిపై నమోదైన వరుస ఎన్డిపిఎస్ (NDPS Act) కేసులు చూస్తే ఇతనికి అంతర్రాష్ట్ర డ్రగ్ నెట్వర్క్తో ఉన్న బలమైన సంబంధాలను స్పష్టం చేస్తున్నాయి. కేవలం గంజాయి స్మగ్లింగ్ చేయడమే కాకుండా, ఇతను స్వయంగా గంజాయి, మద్యానికి బానిస అయ్యాడని.. నిరంతరం పాత నేరస్థులతో టచ్లో ఉంటూ నగరంలో పెద్ద ఎత్తున గంజాయి ముఠాలను నడిపిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
సోషల్ మీడియాలో 'డాన్' అవతారం.. యువతకు గంజాయి ఎర :
ఈ రౌడీషీటర్ సమాజానికి మరింత ప్రమాదకరంగా మారాడు అని చెప్పటానికి ఇతని సోషల్ మీడియా ప్రవర్తనే చెప్తుంది. సోషల్ మీడియా వేదికలపై పిల్లా సాయి తన అనుచరులతో కలిసి దిగిన ఫోటోలు, బైక్ స్టంట్లు, మరియు ప్రమాదకరమైన ఆయుధాలతో ఉన్న విజువల్స్ పోస్ట్ చేస్తూ ఒక 'క్రిమినల్ ఇన్ఫ్లుయెన్సర్' లా చలామణీ అవుతున్నాడు. ముఖ్యంగా, యువతను ఆకర్షించేలా గంజాయి తాగుతున్న వీడియోలను షేర్ చేస్తూ, దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు జోడించి రెచ్చగొడుతున్నాడు. ఒక పోస్ట్లో "ONCE I LOST MY CONTROL DON'T CARE WHO IS STANDING IN FRONT OF ME" (నేను నియంత్రణ కోల్పోతే నా ముందు ఎవరున్నా కేర్ చేయను) అంటూ సమాజంలో భయాందోళనలు సృష్టించేలా డైలాగులు పెట్టడం గమనార్హం. తుపాకీని తలపై పెట్టుకుని ఉన్న ఫోటోలు, గొడ్డలిని భుజంపై వేసుకుని ఉన్న విజువల్స్ ద్వారా యువతను తప్పుదోవ పట్టిస్తూ తన ముఠాలోకి ఆకర్షిస్తున్నాడు.