రాష్ట్ర భవిష్యత్తుని నిర్మించే ప్రక్రియకి ఒక బలమైన నాయకత్వం అవసరం. ప్రజాస్వామ్యంలో నాయకత్వం ఒక రోజులో పుట్టదు. అది గ్రామ సభల్లో, పంచాయతీల్లోనే రూపుదిద్దుకుంటుంది. పంచాయతీ రాజ్ వ్యవస్థ కేవలం ఒక స్థానిక పరిపాలనా వ్యవస్థ కాదు. అది నాయకత్వాన్ని తయారు చేసే ప్రజాస్వామ్య పాఠశాల. గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు తన ప్రయాణాన్ని స్థానిక సంస్థల నుంచే ఒక మున్సిపల్ కౌన్సిలర్ గా మొదలుపెట్టారు. లీడర్ షిప్ అంటే కేవలం రాజకీయ నాయకత్వం కాదు. డాక్టర ఏపీజే అబ్దుల్ కలాం గారు నాయకుడు, మనమంతా గౌరవించే శ్రీ ఎస్.ఆర్. శంకరన్ గారు పాలనాపరంగా గొప్ప నాయకుడు. గొప్ప ఉపాధ్యాయుడు, నిజాయితీగల అధికారి కూడా నాయకులే. పంచాయతీని బలోపేతం చేసే సర్పంచ్ అందరికంటే బలమైన నాయకుడు. భారత దేశంలో మహిళా రాజకీయ నాయకత్వానికి అతిపెద్ద విశ్వ విద్యాలయం పంచాయతీరాజ్ వ్యవస్థ. 50 శాతం మహిళా రిజర్వేషన్ ద్వారా వేలాది మంది మహిళా నాయకులు స్థానిక సంస్థల ద్వారా ముందుకు వస్తున్నారు. స్వయం సహాయక బృందాల ద్వారా మహిళలు సామాజిక, ఆర్ధిక నాయకత్వాన్ని చేపడుతున్నారు. వెనుకబడిన తరగతులు, యువత నుంచి నాయకత్వం వస్తుంది. యువత మొదటి అడుగు గ్రామ స్థాయిలోనే వేయాలి.
• గ్రామ సభతో ప్రతి గడపకు ప్రజాస్వామ్యం
అభివృద్ధికి మొదటి అర్హత స్థిరత్వం. రాష్ట్రంలో గత రెండేళ్లుగా ఏర్పడిన రాజకీయ స్థిరత్వం గ్రామాభివృద్ధికి బలమైన పునాది వేసింది. ఎన్డీఏ నిర్ణయాలతో స్పష్టత వచ్చింది. కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం బలపడింది. ఆ స్థిరత్వం ఆధారంగా గ్రామాన్ని పరిపాలనా కేంద్రంగా నిలబెట్టే ప్రయత్నం ప్రారంభించాం. అందులో భాగంగా 13,326 పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించాం. ప్రజాస్వామ్యాన్ని ప్రతి గడపకు తీసుకువెళ్లాం. ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శిని నియమించాం. స్థానిక అవసరాలకు తగిన విధంగా విధి విధానాలకు రూపకల్పన చేశాం. గ్రామ పంచాయతీల పరిపాలనా సామర్థ్యాన్ని బలోపేతం చేశాం. పల్లెపండుగను ప్రజా ఉద్యమంగా మార్చాం. రాజకీయాలకు అతీతంగా స్థానిక నాయకత్వానికి పోయిన గౌరవాన్ని తిరిగి నిలబెట్టాం.
స్వర్ణ పంచాయతీ దిశగా ప్రయాణం ప్రారంభించాం. ప్రతి ఆలోచనా సిద్ధాంతంగా మిగిలిపోకూడదు, ఫలితంగా కనబడాలన్నదే స్వర్ణ పంచాయతీ. ఇందుకు ఒక ఉదాహరణ. తిరుపతి జిల్లా పరిధిలోని శ్రీనివాసపురం పంచాయతీలో స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆస్తుల వివరాలు శాస్త్రీయంగా నమోదు చేశాం. ఇప్పటి వరకు పంచాయతీ రికార్డులలో కనిపించని ఆస్తులు మొదటిసారి వ్యవస్థల్లో కనిపించాయి. ఆస్తుల సంఖ్య 1,291 నుంచి 1,356కి పెరిగింది. ఫలితంగా పంచాయతీ ఆధాయ సామర్థ్యం రూ. 75 లక్షల నుంచి రూ. 1.66 కోట్లకు పెరిగింది. ఒక్క రూపాయి పన్ను పెంచలేదు. కేవలం స్వర్ణ పంచాయతీ పోర్టల్ లో ఆస్తుల వివరాలు మాత్రమే అప్డేట్ చేశాం. వ్యవస్థలు సరిగా పని చేస్తే గ్రామాలు ఎంతటి సామర్థ్యాన్ని సృష్టించగలవో చెప్పే ఉదాహరణ ఇది. భారత దేశపు అభివృద్ధి ప్రయాణంలో తదుపరి అడుగు ఇక్కడే ఉంది. 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణం పార్లమెంటు భవనం నుంచి కాదు. 2.6 లక్షల గ్రామ పంచాయతీల నుంచి ప్రారంభం అవుతుంది. భారత దేశ భవిష్యత్తు పార్లమెంటులో మాత్రమే కాదు. గ్రామ పంచాయతీల్లో కూడా రాయబడుతుంది. ఒక చిన్న వాగు మొదట తన పరిసరాల్లోని భూములకు నీరందించి తదుపరి నదుల్లో కలుస్తుంది. అలాగే ప్రతి పంచాయతీ ముందుగా తన పరిధిలోని గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడే మండలం, జిల్లా, రాష్ట్రం, తద్వారా దేశం బలపడుతుంది.
రెండేళ్ల క్రితం ప్రజలు మాకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చారు. అది కేవలం అధికార బదిలీ కాదు. నమ్మకం బదిలీ. నమ్మకాన్ని నిలుపుకోవడం మన బాధ్యత ఈ దిశగా పని చేస్తన్నాం. నిధుల కోసం, విధానాల కోసం నేను పోరాడగలను. అధికారాల కోసం పోరాడగలను. అయితే ప్రజల భాగస్వామ్యం లేకుండా అభివృద్ధి సాధ్యపడదు. ప్రజలు పార్టీని కాకుండా వ్యవస్థల్ని నమ్మాలి. పార్టీలు వ్యవస్థల్ని బలోపేతం చేయడానికి ఉండాలి. నాయకులను కాకుండా సంస్థలను, వ్యక్తులను కాకుండా విలువలను నమ్మాలి. అప్పుడే ప్రజాస్వామ్యం శాశ్వతం అవుతుంది. ఏ పార్టీ నాయకులు అయినా వ్యవస్థల్ని బలోపేతం చేసే దిశగా, విలువల్ని కాపాడే దిశగా, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తే కూటమికి తిరుగుండదు. అప్పుడు మాత్రమే గ్రామస్వరాజ్యం సాధ్యం అవుతుంది. సామాజిక విశ్వాసం పునరుద్ధరణ జరుగుతుంది. అప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుంది. గ్రామం బలపడితేనే ప్రజాస్వామ్యం బలపడుతుంది. ప్రజాస్వామ్యం బలపడితే దేశం బలపడుతుంది. అందుకే మా ప్రయాణం కేవలం ఒక ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం కాదు. దేశాన్ని నిర్మించడం కోసం. మనం తీసుకునే నిర్ణయాలు వచ్చే ఎన్నికల గురించి కాకుండా భవిష్యత్ తరాల కోసం ఉండాలి. అదే ప్రజాస్వామ్యం, అదే సుస్థిర అభివృద్ధి, వికసిత్ భారత్ కు మార్గం. రాబోయే తరాలు గర్వించే సమాజాన్ని నిర్మించడం కూటమి బాధ్యత.